అధికారంలో ఉన్నవారు చట్టాలకు, వ్యవస్థలకు తాము అతీతులమనుకొంటూ యధేచ్చగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటారు. అందుకు తాజా ఉదాహరణగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్కు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించడం గురించి చెప్పుకోవచ్చు. 2021లో జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఆయన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఆ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. అయితే ఆయనకు తమ రాజకీయ ప్రత్యర్ధుల వలన ప్రమాదం పొంచి ఉంది కనుక జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నామని సిఎం మమతా బెనర్జీ చెపుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు అందించడం..ఆయనకూ ఆ పార్టీకి సంబందించిన ప్రైవేట్ వ్యవహారమే తప్ప ప్రభుత్వ వ్యవహారమో... ప్రజలకు సంబందించిన వ్యవహారమో కాదు. ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించాలనుకుంటే దాని కోసం పార్టీ నిధుల నుంచి సొమ్మును ఖర్చు చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ తమ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వ్యక్తికి ప్రభుత్వ సొమ్ముతో పరిగణించి జెడ్ కేటగిరీ భద్రతను కల్పించడం అధికారం, ప్రజాధనం రెండూ దుర్వినియోగం చేయడమే అవుతుంది కదా?