లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలవడంతో కాడి పడేసి చేతులు దులుపుకొన్న రాహుల్ గాంధీకి బహుశః డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమితో కూడా సంబందం లేదనే భావిస్తున్నారేమో? అయితే ఎప్పటికైనా బిజెపిని ఓడించి ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్న రాహుల్ గాంధీ, తన సత్తాను నిరూపించుకొనేందుకు డిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఒక గొప్ప అవకాశంగా భావించి గట్టిగా కృషి చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి కనీసం గౌరవ ప్రదమైన స్థానాలైనా దక్కి ఉండేవేమో? కానీ ఎన్నికలకు ముందే ఓటమికి సిద్దపడటంతో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కనుక లోక్సభ ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయమేనని చెప్పవచ్చు. ఈ ఎన్నికలలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొని ఓడించి తన నాయకత్వ లక్షణాలను మరోసారి నిరూపించుకోగా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించలేరని మరోసారి రుజువయ్యింది.
ఒక్క డిల్లీలోనే కాక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగానే ఉంది. కనుక మళ్ళీ పార్టీకి పూర్వవైభవం తీసుకురాగల సమర్ధుడైన నాయకుడిని వెతికి పట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.