అసెంబ్లీ ఎన్నికలలోనే కాంగ్రెస్ కంచుకోటలలో టిఆర్ఎస్ గులాబీ జెండాలు ఎగురవేసింది. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికలలో మిగిలిన కంచుకోటలను టిఆర్ఎస్ స్వాధీనం చేసుకొని గులాబీ జెండాలు ఎగురవేసి రాష్ట్ర రాజకీయాలలో తన ఆధిక్యతను మరోసారి నిరూపించుకొంది. అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ ఎంత ప్రయత్నించినప్పటికీ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీని ఓడించలేకపోయింది. కానీ ఈసారి జిల్లాలోని 14 మునిసిపాలిటీలలో ఏకంగా 13 గెలుచుకొని కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేసింది.
ఈ విజయానికి కారణం మంత్రి హరీష్రావు వ్యూహాలే అని చెప్పవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మంచి పట్టున్న సంగారెడ్డి, సదాశివపేట మునిసిపాలిటీలలో టిఆర్ఎస్ విజయం సాధించడం ద్వారా మంత్రి హరీష్రావు జగ్గారెడ్డిపై ప్రతీకారం తీర్చుకొన్నట్లయింది. సింగూరు జలాలను మంత్రి హరీష్రావు తరలించుకుపోయి సంగారెడ్డి పట్టణావాసులకు త్రాగునీరులేకుండా చేశారని, కనుక ఆయనను పట్టణంలో అడుగుపెట్టనీయనంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తరచూ హెచ్చరిస్తుండేవారు. ఇప్పుడు హరీష్రావే జగ్గారెడ్డికి సంగారెడ్డిలో స్థానం లేకుండా చేసి తన సత్తా చూపించుకొన్నారు. అంతేకాదు జగ్గారెడ్డి చేస్తున్న ఆరోపణలను సంగారెడ్డి ప్రజాలెవరూ పట్టించుకోలేదని స్పష్టమైంది.