నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెరుగబోతున్నాయి. ఆర్టీసీ మనుగడ కోసం కిలో మీటరుకు 20 పైసలు చొప్పున పెంచాలని సిఎం కేసీఆర్ నిర్ణయించడంతో నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఆర్టీసీని కాపాడుతామంటూనే ప్రజలపై ఇంత భారాన్ని మోపడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్వర్యంలో నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనలు తెలియజేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత ముంగి జైపాల్ రెడ్డి తెలిపారు. కనుక ప్రజలు, ప్రజాసంఘాలు అందరూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని తమకు సంఘీభావం తెలుపాలని విజ్ఞప్తి చేశారు.
అయితే ఆర్టీసీ సమ్మె సందర్భంగా బయటపడిన ఆర్టీసీ ఆర్ధికదుస్థితి, ఆర్టీసీ కార్మికుల పరిస్థితులు, ఆర్టీసీకి, దాని కార్మికులకు సిఎం కేసీఆర్ నిన్న వరాలు ప్రకటించడం వంటివన్నీ ప్రజలపై ప్రభావం చూడపడం ఖాయం. ఆర్టీసీ సమ్మె కారణంగా గత 55రోజులుగా అట్టుడికిపోయిన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడిప్పుడే ప్రశాంతత నెలకొంటోంది. కనుక బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ మళ్ళీ ధర్నాలు, ఆందోళనలు చేసేందుకు ప్రజలు ముందుకు రాకపోవచ్చు. ఈ సంగతి రాజకీయ పార్టీలకు కూడా తెలిసే ఉంటుంది కనుక అందుకే ఖండన ప్రకటనలతో సరిపెట్టాయని భావించవచ్చు.