మూడు రోజుల క్రితం తెరాస ఎంపీ కే కేశవరావు హటాత్తుగా మీడియా ముందుకు వచ్చి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉండాలని, తాను మద్యవర్తిత్వం వహించడానికి సిద్దంగా ఉన్నాని చెప్పారు. సిఎం కేసీఆర్ సూచన మేరకే ఆయన ఆ ప్రతిపాదన చేసి ఉంటారని భావించిన ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వంతో చర్చలకు సిద్దమని వెంటనే ప్రకటించాయి. కానీ ఆ మరుసటిరోజే కెకె మాట మార్చి, ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపడంపై సిఎం కేసీఆర్ నుంచి తనకు ఎటువంటి ఆదేశాలు రాలేదని, కనుక తాను ఏమీ చేయలేనని చేతులెత్తేశారు. \
బుదవారం రాత్రి ప్రగతి భవన్లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్టీసీ సమ్మె పట్ల తన వైఖరిలో ఎటువంటి మార్పు లేదని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు మద్యవర్తిత్వం చేయడానికి సిద్దపడిన కెకె ఆర్టీసీ సమ్మెపై సిఎం కేసీఆర్ వైఖరి తెలుసుకొన్నందునే బహుశః వెనక్కు తగ్గి ఉందవచ్చు. కానీ ఈ వ్యవహారంలో తలదూర్చినందుకు ఇప్పుడు ఆయన కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది. కనుక ఇది మరో సమస్యగా మారినా ఆశ్చర్యం లేదు.