నేడు హుజూర్‌నగర్‌లో సిఎం కేసీఆర్‌ బహిరంగ సభ

October 17, 2019


img

ఈనెల 21వ తేదీన జరుగనున్న హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలలో తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా ఈరోజు సిఎం కేసీఆర్‌ హుజూర్‌నగర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. పట్టణంలోని సాయిబాబా ధియేటర్ రోడ్డులో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభ మొదలవుతుంది. తెరాస మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల ఇంఛార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరాస నేతలు ఈ సభ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే హుజూర్‌నగర్‌లో మంత్రులు, తెరాస నేతలు ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రచారం కీలకదశకు చేరుకున్న ఈ సమయంలో సిఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో తెరాస శ్రేణులకు మరింత ఉత్సాహం కలుగుతుంది. నియోజకవర్గం ప్రజలపై కూడా కేసీఆర్ ప్రభావం బలంగా పడవచ్చు. 

రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్ర ప్రజలలో తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈనెల 19న రాష్ట్ర బంద్‌ కూడా జరుగబోతోంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ అంశంపై సిఎం కేసీఆర్‌ నేడు జరుగబోయే సభలో గట్టిగానే మాట్లాడవచ్చు. ఎన్నికల ప్రచార సభలో ఆర్టీసీ కార్మికులను తప్పు పడుతూ మాట్లాడితే తెరాసకే నష్టం కనుక సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను వెనకేసుకువస్తూ వారికి మద్దతు ఇస్తున్న  ప్రతిపక్షాలను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయవచ్చు. ఈ సభ తరువాత తెరాసకు కాంగ్రెస్‌, బిజెపి, వామపక్షాలకు మద్య మళ్ళీ యుద్ధం ప్రారంభం కావచ్చు.


Related Post