“ఎంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటానో నాకే తెలియదు. ఎప్పుడు పార్టీ మారాలో కాలమే నిర్ణయిస్తుంది..సింగూరు జలాలను హరీష్రావు తరలించుకుపోవడం వలననే సంగారెడ్డిలో నీటి ఎద్దడి వచ్చింది...” అంటూ మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించిన సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురువారం మధ్యాహ్నం అసెంబ్లీలో హరీష్ రావుతో కొంతసేపు ఏకాంతంగా మంతనాలు చేయడం విశేషం. తన నియోజకవర్గం అభివృద్ధి పనుల గురించి మంత్రి హరీష్రావుతో మాట్లాడానని జగ్గారెడ్డి చెప్పారు. తాను ప్రస్తావించిన సమస్యలపై హరీష్రావు సానుకూలంగా స్పందించారని చెప్పారు.
విదేశాలకు మనుషుల అక్రమరవాణా చేసిన కేసులో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జైలుకు వెళ్ళి వచ్చిన జగ్గారెడ్డి ఎన్నికలలో గెలిచిన తరువాత కేసీఆర్ పట్ల విధేయత ప్రకటించారు. ఆ సమయంలోనే తెరాసలో చేరే ఆలోచనలో ఉన్నట్లు మాట్లాడారు. కానీ ఆ తరువాత మళ్ళీ ఏమయిందో గానీ మళ్ళీ తెరాస సర్కార్పై మెల్లగా విమర్శలు మొదలుపెట్టారు. ముఖ్యంగా హరీష్రావుపై అనేకసార్లు విమర్శలు గుప్పించారు. కానీ నేడు మళ్ళీ అదే హరీష్రావుతో సమావేశం కావడం విశేషం. ఒకవేళ ఇప్పుడు తెరాసలో చేరాలనుకొంటున్నా లేదా సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి హరీష్రావు సహకారం కావాలనుకున్నా ఆయనపై చేసిన విమర్శలను జగ్గారెడ్డి వెనక్కు తీసుకోగలరా ఇప్పుడు?