ఇటీవలే భారత్ వాయుసేనలో చేరిన తేజస్ యుద్ధవిమానంలో గురువారం ఉదయం రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ పయనించడమే కాకుండా పైలట్ పర్యవేక్షణలో 2 నిమిషాలపాటు విమానాన్ని నియత్రించారు కూడా. ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉందని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
ఈ సందర్భంగా డిఆర్డీవో చీఫ్ సతీష్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ, “తేజస్ తేలికపాటి యుద్ధవిమానం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేయబడింది. వారం రోజుల క్రితమే కీలకమైన ‘అరెస్టెడ్ ల్యాండింగ్’ పరీక్షలను విజయవంతంగా నిర్వహించాము.
సముద్రజలాలలో పయనించే యుద్ధనౌకలపై చాలా చిన్న రన్ వే ఉంటుంది. దానిలోనే యుద్ధవిమానాలు పైకి ఎగురవలసి ఉంటుంది. దిగవలసి ఉంటుంది. పైగా సముద్రంలో వేగంగా పయనిస్తున్న యుద్ధనౌకపై నుంచి కూడా టేకాఫ్, ల్యాండింగ్ చేయవలసి ఉంటుంది.
సాధారణంగా యుద్ధవిమానాలు బయలుదేరేటప్పుడు చాలా వేగంగా పయనిస్తాయి కనుక ఆ చిన్న రన్ వే చివరికి చేరుకునేసరికి గరిష్టవేగం సాదించి అక్కడి నుంచి వేగంగా ఆకాశంలోకి దూసుకుపోగలుగుతాయి. కానీ దిగేటప్పుడు వేగం పూర్తిగా తగ్గించుకొని దిగవలసి ఉంటుంది. లేకుంటే విమానం దూసుకుపోయి సముద్రంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక యుద్ధనౌకలపై విమానాలు దిగే ప్రతీసారి పైలట్లు అతిప్రమాదకరమైన స్టంట్ చేస్తున్నట్లే భావించవచ్చు. దీనినే అరెస్టెడ్ ల్యాండింగ్ అంటారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేయబడిన తేజస్ యుద్దవిమానాలు కూడా యుద్ధనౌకలపై ‘అరెస్టెడ్ ల్యాండింగ్’ చేయగలుగుతున్నాయి. దీంతో ఇటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, యుద్ధవిమానాలు కలిగిన అగ్రదేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది.