భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈనెల 26వ తేదీన నార్కాట్పల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్థానని ప్రకటించారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని పొరపాట్ల వలన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని వాటిని సరిదిద్దుకొని, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని తెరాసను ఓడించి తప్పకుండా అధికారంలో వస్తామని అన్నారు. బిజెపిని ఉద్దేశ్యించి, “అది తెరాసకు తోక పార్టీ మాత్రమే. కానీ రాష్ట్రంలో మేమే తెరాసకు ప్రత్యామ్నాయమంటూ హడావుడి చేస్తుంటుంది. మళ్ళీ అవసరమైనప్పుడు రెండు పార్టీలు పరస్పరం సహకరించుకొంటుంటాయి. ఆ రెండు పార్టీల మద్య గత 5 ఏళ్ళు ఏవిధంగా సహకరించుకున్నాయో అందరూ చూశారు. ఇప్పటికీ అదే విధంగా ఉన్నాయని పార్లమెంటు సమావేశాలలో మరోసారి నిరూపించుకున్నాయి. కనుక వాటిని నమ్మలేము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే పూర్తి పారదర్శకంగా ఉంటుంది,” అని అన్నారు.
బిజెపితో తెరాసకు రహస్య అవగాహన ఉందనే విమర్శల వలన తెరాసకు ఎటువంటి నష్టమూ లేదు కానీ బిజెపికి చాలా నష్టమని అసెంబ్లీ ఎన్నికలలో రుజువైంది. కనుక ఇప్పటికైనా బిజెపి తెరాస పరిధిలో నుంచి బయటకు రాలేకపోతే దాని మాటలను ఎవరూ నమ్మరు కనుక దానికే నష్టం.