జమ్ముకశ్మీర్పై నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలతోనే ఉక్రోషంతో భారత్పై బుసలు కొడుతున పాక్ పాలకులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరో పెద్ద షాక్ ఇచ్చారు. హర్యానాలో కల్కాలో జరిగిన ఒక బహిరంగసభలో రాజ్నాథ్ సింగ్ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “భారత్పైకి తీవ్రవాదులను, వేర్పాటువాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్తో ఇకపై చర్చలు ఉండవు. ఒకవేళ ఉంటే అవి పాక్ ఆక్రమిత కశ్మీర్పైనే ఉంటాయి. అందుకు పాక్ సిద్దమైతే మనం కూడా చర్చలకు సిద్దమే,” అని అన్నారు.
ఇప్పటి వరకు పాకిస్థాన్ కశ్మీర్ అంశంపై ద్వైపాక్షిక చర్చలు జరుగాలంటూ వాదిస్తోంది. కానీ ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్పైద్వైపాక్షిక చర్చలు జరుపాలనే సరికొత్త వాదనను భారత్ తెరపైకి తీసుకురావడం పాక్ పాలకులకు ఊహించని షాక్ అనే చెప్పవచ్చు. కనుక కశ్మీర్ అంశంపై పాక్ ఏవిధంగా అంతర్జాతీయంగా భారత్పై పైచెయ్యి సాధించాలని చూస్తోందో అదేవిధంగా ఇప్పుడు భారత్ కూడా ప్రయత్నించడానికి ఒక ఆయుధం సమకూర్చుకొంది. కశ్మీర్ సమస్య ద్వైపాక్షిక సమస్య కనుక దానిలో జోక్యం చేసుకోబోమని ప్రపంచదేశాలన్నీ చెపుతున్నాయి కనుక పాక్ ఆక్రమిత కశ్మీర్పై భారత్ వాదనలో కూడా జోక్యం చేసుకోకపోవచ్చు. ఈ తాజా వాదనను పాక్ పాలకులు జీర్ణించుకోవడం కష్టమే. వారికి ఇది పుండు మీద కారం చల్లినట్లవుతుంది.