తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో తుఫాను మొదలైనట్లుంది. గత వారం పది రోజులుగా టీవీ9 కొత్త యాజమాన్యం అలందా మీడియాకు, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు మద్య జరిగిన వ్యాపార ఘర్షణలు అనేక మలుపులు తిరిగి రవిప్రకాశ్పై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడం, ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇంతలోనే మరో తెలుగు న్యూస్ ఛానల్ 'మోజో టీవీ'లో కూడా ఇంచుమించు అటువంటి సమస్యే బయటపడింది.
ఆ సంస్థ సీఈఓ రేవతి హైదరాబాద్లోని తమ ప్రధానకార్యాలయం ముందు బుదవారం హటాత్తుగా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోన్నారు. ఛానల్లోని తన షేర్లను బదలాయించాలంటూ కొందరు వ్యక్తులు తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.
ఒక మహిళా సీఈఓ చాలా ధైర్యంగా సమాజంలో అవినీతిని, అక్రమాలను వెలికితీసి బయటపెడుతుంటే, ఆమెను ఆ టీవీ ఛానల్ నుంచి బయటకు పంపించడానికే ఆమె షేర్లను బదలాయించాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. తనపై ఎవరు ఒత్తిడి చేస్తున్నారో వారి పేర్లను ఆమె బయటపెట్టలేదు. ఈ వ్యవహారం గురించి ఆమె తరపు వాదన మాత్రమే తెలిసింది. రేపు ఆమె ప్రత్యర్దుల చెప్పబోయేది కూడా విన్నాక అసలు సమస్య, విషయం ఏమిటో స్పష్టం అవుతుంది.