కేంద్రంలో మళ్ళీ మోడీ సర్కారే వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అవకాశం వస్తే ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాంగ్రెస్ అధిష్టానం నేరుగా మాయావతి, మమతా, అఖిలేశ్, ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలతో సంప్రదింపులు చేస్తుంటే, కాంగ్రెస్ తరపున చంద్రబాబునాయుడు, శరద్ పవార్ తదితరులు మద్దతు కూడగట్టడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు.
శరద్ పవార్ ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సిఎం కేసీఆర్లతో నేరుగా ఫోన్లో మాట్లాడి యూపీయేకు మద్దతు ఈయవలసిందిగా కోరినట్లు సమాచారం. ఈ వార్తను తెరాస నేతలు కొట్టిపడేస్తున్నప్పటికీ, నవీన్ పట్నాయక్ మాత్రం సానుకూలంగా స్పందించారని, లోక్సభ ఫలితాలు వెలువడిన తరువాత యూపీయేకు అనుకూల పరిస్థితి ఉంటే తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పారని బిజెడి పార్టీ నేతలు చెప్పారు. రేపు ఎలాగూ ఫలితాలు వెలువడబోతున్నప్పుడు అవి ఏవిధంగా ఉండబోతున్నాయో తెలుసుకోకుండా ఇప్పుడే హామీ ఇవ్వడం తొందరపాటే అవుతుందని కేసీఆర్ ఉద్దేశ్యం కావచ్చు.