లోక్సభ ఎన్నికలలో బిజెపికి 200, కాంగ్రెస్ పార్టీకి 100 లోపు సీట్లు వస్తాయని కనుక తెరాస 16 ఎంపీ సీట్లు గెలుచుకొంటే మిత్రపక్షాలతో కలిసి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సిఎం కేసీఆర్తో సహా తెరాస నేతలందరూ ఎన్నికల సమయంలో పదేపదే నొక్కి చెప్పారు. కానీ బిజెపికి సొంతంగానే 280కు పైగా సీట్లు వస్తాయని, ఎన్డీయే మిత్రపక్షాలతో కలిపి 310కు పైగా సీట్లు సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో నిన్న జోస్యం చెప్పాయి.
ఒకవేళ వాటి జోస్యం ఫలించి కేంద్రంలో బిజెపి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తే అప్పుడు తెరాస ఏమి చేస్తుంది? అంటే ఫెడరల్ ఫ్రంట్ మళ్ళీ అటకెక్కించేసి యధాప్రకారం మోడీతో కేసీఆర్ సన్నిహితంగా మెలుగవచ్చు లేదా కేటీఆర్ను తెలంగాణ ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ నిర్ణయించుకొంటే, కేంద్రమంత్రి పదవి లభిస్తే కెసిఆర్ ఎన్డీయేలో చేరవచ్చు లేదా జాతీయరాజకీయాలలోకి షిఫ్ట్ అయ్యి జాతీయపార్టీ స్థాపన పనులతో కాలక్షేపం చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ, కేంద్రంలో చక్రం తిప్పుతామని చెప్పి తెరాస రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు సాధించుకోబోతునట్లు స్పష్టం అవుతోంది.