ఏపీ టిడిపిలో చిత్రవిచిత్రమైన నాయకులకు కరువులేదు. అటువంటివారిలో జెసి దివాకర్ రెడ్డి కూడా ఒకరు. ఆయన నోరు విప్పి మాట్లాడారంటే సంచలనమే. ఆయన ప్రత్యర్ది పార్టీనే విమర్శిస్తారో లేక సొంత పార్టీనే విమర్శిస్తారో ఎవరూ ఊహించలేరు.
తాజాగా అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబునాయుడు అనేక సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొంటూ రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అనేక సంక్షేమపధకాలు ప్రవేశపెట్టారు. నదుల అనుసంధానం చేసి రైతులకు నీళ్ళు అందించారు. ఈ 5 ఏళ్ళలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ ఎవరూ ఆయనను పట్టించుకోలేదు. ఎవరూ ఆయన కష్టాన్ని గుర్తించలేదు. అభినందించిన పాపన్న పోలేదు. కనుక ప్రజలకు ఎందుకు చేయాలి?నాకవసరం ఏమిటి? అని అనుకోకుండా చంద్రబాబునాయుడు తనదైన శైలిలో పనిచేసుకుపోతూనే ఉన్నారు. ఈలోగా ఎన్నికలొచ్చాయి. ఈసారి ఒడ్డున పడతామో లేదో అనే పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ప్రకటించి వెంటనే అమలుచేసిన ఆడవాళ్ళకు పసుపు-కుంకుమ పధకం, వృద్దులకు రెట్టింపు పెన్షన్ పధకాలతో టిడిపి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇన్నాళ్లుగా చంద్రబాబునాయుడు ఎన్ని పనులు చేసినా పట్టించుకోని ప్రజల నుంచి ఆ రెండు పధకాలకు అపూర్వమైన స్పందన వస్తోంది. వాటిలో పసుపు-కుంకుమ పధకమే ఈసారి మా టిడిపిని కాపాడి ఒడ్డున పడేయబోతోంది. చంద్రబాబునాయుడే మళ్ళీ ఏపీకి ముఖ్యమంత్రి కాబోతున్నారు,” అని అన్నారు.