రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదన్నట్లయింది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి ఇప్పుడు. తుమ్మల, నామా నాగేశ్వరరావు ఇద్దరూ ఒకే (ఖమ్మం)జిల్లాకే చెందినవారవడంతో ఇదివరకు వారిరువురూ టిడిపిలో ఉన్నప్పుడు నామాతో తుమ్మల చాలా ఇబ్బందిపడేవారు. జిల్లా రాజకీయాలపై ఇద్దరికీ సమానంగా పట్టున్నప్పటికీ, నామా నాగేశ్వరరావు డామినేషన్ ఎక్కువగా ఉండటంతో చంద్రబాబునాయుడు ఆయనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండేవారు. తుమ్మల నాగేశ్వరరావు సౌమ్యంగా వ్యవహరించేవారు కనుక ఎప్పుడూ సర్దుకుపోతుండేవారు.
ఆ తరువాత కేసీఆర్ ఆహ్వానం మేరకు తుమ్మల తెరాసలో చేరడం మంత్రిపదవి చేపట్టి జిల్లా అభివృద్ధికి విశేషకృషి చేసి అటు ప్రజలలో ఇటు కేసీఆర్ వద్ద మంచిపేరు సంపాదించుకొన్నారు. అంతా సవ్యంగా సాగుతోందనుకొంటే అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఆ షాకు నుంచి తేరుకొని మళ్ళీ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంటే, నామా నాగేశ్వరరావు కూడా తెరాసలో చేరడం ఆయనకు మరో షాక్. పైగా తుమ్మల ఎన్నికలలో ఓడిపోయినప్పుడు నామా తెరాసలోకి ఎంట్రీ ఇచ్చి లోక్సభ టికెట్ దక్కించుకొని పోటీ చేస్తుండటం, నామాకు సహకరించవలసిరావడం తుమ్మలకు చాలా ఇబ్బందికరమే.