అన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు వేర్వేరు వ్యూహాలను అమలుచేయడం సహజమే. అసెంబ్లీ ఎన్నికలలో ఎటువంటి వ్యూహాలు అమలుచేశాయో అందరూ చూశారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు తెరాస 16 ఎంపీ సీట్లు ఇస్తే దేశాన్ని ఎవరు పాలించాలో నిర్ణయించే శక్తి తెలంగాణకు వస్తుందని, అప్పుడు కేంద్రం మెదలువంచి రాష్ట్రానికి రావలసినవన్నీ సాధించుకోవచ్చునని వాదిస్తోంది.
లోక్సభ ఎన్నికలు ప్రధాని నరేంద్రమోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్య జరుగుతున్న యుద్దమని దానిలో సిఎం కేసీఆర్ పాత్ర ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది.
కేంద్రంలో సుస్థిరమైన, బలమైన ప్రభుత్వంతో అత్యంత పారదర్శకంగా, చురుకుగా, అవినీతిరహితంగా పనిచేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని చూసి మళ్ళీ తమకే ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని బిజెపికి కోరుతోంది.
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. లోక్సభ ఎన్నికలు జాతీయ రాజకీయాలకు సంబందించినవి. కనుక ప్రజలు దేశప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తగిన పార్టీ లేదా కూటమికి అధికారం అప్పగించవలసి ఉంటుంది. వివిద పార్టీల వాదనల మాయలో పడి భిన్నమైన తీర్పు ఇస్తే కేంద్రంలో అస్థిరమైన, బలహీనమైన ప్రభుత్వం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. దాని వలన దేశ ప్రగతి మందగించవచ్చు. దేశానికి ఎంత నష్టం జరిగినా మన రాజకీయ పార్టీలు... వాటి నేతలు ఏమాత్రం నష్టపోరు. వారిని గెలిపించిన దేశప్రజలే నష్టపోతారు. ఆ భారాన్ని సామాన్య పౌరులే మోయవలసి ఉంటుందని మరిచిపోకూడదు. కనుక ఈ వాదోపవాదాలలో నిజానిజాలను దేశప్రజలు స్వయంగా బేరీజు వేసుకొని సరైన పార్టీలను, సమర్ధులైన నేతలను ఎన్నుకోవలసి ఉంటుంది.