ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాధ్, కేసీఆర్లు విశాఖపట్నంలో గల శారదా పీఠంలో కలుసుకోబోతున్నారు. ఈ నెల 10 నుంచి 15వరకు శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగనున్నాయి. వాటిలో భాగంగా రోజూ హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఫిబ్రవరి 14వ తేదీన నిర్వహించబడే అష్టబందనా మహా కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొనేందుకు వారిరువురు విశాఖకు వస్తున్నారు.
తెరాస-బిజెపి-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందని కాంగ్రెస్, టిడిపి తదితర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వారి ఆరోపణలకు బలం చేకూరే విధంగా తెరాస, బిజెపిల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డితో మంచి సాన్నిహిత్యం ఉన్న స్వరూపానందస్వామివారి శారదా పీఠంలో కలుసుకోబోతున్నారు. వారి కలయిక కేవలం పూజలకే పరిమితం అవుతుందా లేక ఆ మూడు పార్టీల మద్య బంధం దృడపడేందుకు దోహదపడుతుందా? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభించవచ్చు.