మూడు దశలుగా నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికలలో నేటి నుంచి 2వ దశ ఎన్నికలకు అభ్యర్ధుల నుంచి నామినేషన్లు ఎన్నికల అధికారులు స్వీకరిస్తున్నారు. దీనిలో భాగంగా మొత్తం 4,137 గ్రామపంచాయతీల సర్పంచ్ పదవులకు, వాటిలో 36,620 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎల్లుండి అంటే ఆదివారం సాయంత్రం వరకు నామినేషన్లకు గడువు ఉంటుంది. మరుసటి రోజున నామినేషన్ల పరిశీలించి అర్హులైన అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తారు. జనవరి 16న అభ్యర్ధుల అప్పీళ్ళను పరిశీలించి పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 17వ తేదీ. రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయితీలకు ప్రోత్సాహాక బహుమతిగా రూ.10 లక్షలు నగదు అందిస్తున్నప్పటికీ ఒకవేళ ఎక్కువమంది అభ్యర్ధులు పోటీ పడుతున్నట్లయితే, అదే రోజున అభ్యర్ధులకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్ధులు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. జనవరి 25 ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. అదే రోజు సాయంత్రం ప్రత్యక్ష పద్దతిలో ఉప సర్పంచ్లను కూడా ఎన్నికను నిర్వహిస్తారు.