ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈరోజు భువనేశ్వర్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడబోయే కూటమిలో కాని, బిజెపి కూటమిలోగానీ మేము చేరబోవడం లేదు. ఈసారి లోక్సభ ఎన్నికలలో ఒంటరిగానే పోరాటం చేయబోతున్నాము,” అని చెప్పారు.
కాంగ్రెస్, బిజెపిలతో చేతులు కలపబోమని చెప్పడమంటే కేసీఆర్ ప్రతిపాదనకు సానుకూలంగా ఉన్నట్లు పరిగణించలేము కానీ ఆ అవకాశం ఉందని భావించవచ్చు. గత లోక్సభ ఎన్నికలలో బిజెడి 20 లోక్సభ స్థానాలు గెలుచుకొంది. ఈసారి కూడా అన్ని స్థానాలు గెలుచుకోగలమనే నమ్మకం ఉన్నందునే నవీన్ పట్నాయక్ కాంగ్రెస్, బిజెపిలతో చేతులు కలపబోమని ప్రకటించినట్లు భావించవచ్చు. అయితే లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ లేదా బిజెపి కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ రాకపోయినట్లయితే అప్పుడు బిజెడి మద్దతు కీలకంగా మారవచ్చు. కానీ అప్పటి పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో ఇప్పుడే ఊహించడం కష్టమే. ఒకవేళ కాంగ్రెస్ లేదా బిజెపి కూటమిలో చేరాక అది గెలిస్తే పరువాలేదు కానీ అది ఓడిపోయి రెండవది గెలిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక నవీన్ పట్నాయక్ సరైన నిర్ణయమే తీసుకున్నారని భావించవచ్చు.