ఓటుకు నోటుకేసులో ఒక ఎమ్మెల్యేను ప్రలోభపెట్టి ఆయన మద్దతు పొందేందుకు ఒక టిడిపి నేత భారీగా డబ్బు ముట్టజెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఏసిబి పోలీసులు వలపన్ని పట్టుకోవడం, సంబందిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడం, ఆ కారణంగా రెండు పార్టీల మద్య మొదలైన ఘర్షణను రెండు ప్రభుత్వాల మద్య ఘర్షణగా మారడం, తదనంతర పరిణామాలు అందరికీ తెలుసు. ఆనాటి నుంచి ఎమ్మెల్యేను ప్రలోభపెట్టినందుకు సదరురాజకీయ నాయకుడిపై నేరస్థుడనే ముద్రవేసి అవకాశం చిక్కినప్పుడల్లా అందరూ నిందిస్తున్నారు.
నిజమే! డబ్బు ఎరవేసి ప్రలోభ పెట్టాలనుకొనేవారు ఎవరైనా నేరస్తులే.. తప్పకుండా చట్టప్రకారం శిక్షించవలసిందే. కానీ ఒక ఎమ్మెల్యేను ప్రలోభపెట్టడం నేరమైనప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వందల కోట్ల రూపాయలను పల్లీలు పంచినట్లు పంచిపెట్టడం నేరం కాదా? ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల ఖర్చులపై పరిమితి కూడా ఉన్నప్పటికీ, అభ్యర్ధులు ఇంత విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు మౌనం వహిస్తోంది? రాష్ట్రంలో వందలకోట్లు పంచుతున్నారని, మద్యం ఏరులైపారుతోందని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో రోజూ కధనాలు వస్తున్నా ఎన్నికల సంఘం పట్టించుకోలేదంటే అర్ధం ఏమిటి? ఎన్నికల వ్యవస్థలో బహిరంగంగా కనబడుతున్న ఈ లోపాలను సరిచేసే బాధ్యత ఎన్నికల సంఘానిది కాదా? అని సామాన్య ప్రజలు సైతం అడుగుతున్నారు.