మోత్కుపల్లి నర్సింహులు టిడిపి నుంచి బహిష్కరింపబడిన తరువాత కొంతకాలం చంద్రబాబు నాయుడును తిట్టిపోస్తూ కాలక్షేపం చేశారు. కానీ దాని వలన తన రాజకీయ భవిష్యత్ కు ఉపయోగం ఏమీ ఉండదని గ్రహించి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించి, ప్రజల మద్దతు కూడగట్టడానికి ‘మోత్కుపల్లి శంఖారావం’ పేరిట యాదగిరి గుట్టలో ఒకసారి బహిరంగ సభ కూడా నిర్వహించారు.
అయితే ఈసారి ఎన్నికలలో తెరాస-మహా కూటమి మద్యనే పోటీ ప్రధానంగా ఉండబోతోంది కనుక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం అంతా తేలిక కాదని ఆయనకూ బాగానే తెలుసు కనుక బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ను సంప్రదించినట్లున్నారు. బిఎల్ఎఫ్ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ ఆయనకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించిన్నట్లు శుక్రవారం ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం కంటే బిఎల్ఎఫ్ తరపు పోటీ చేసినట్లయితే దానిలో భాగస్వాములుగా ఉన్నా సిపిఎంతో పాటు 27 పార్టీలు మద్దతు లభిస్తుంది. కనుక మోత్కుపల్లి బిఎల్ఎఫ్ తరపు పోటీ చేయడం మంచి నిర్ణయమేనని చెప్పవచ్చు.