తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేసులో ఉన్న డజనుకుపైగా అభ్యర్ధులలో జైపాల్ రెడ్డి కూడా ఒకరనే మాట తరచూ వినబడుతూనే ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతలకు ఆయన స్వయంగా ఫోన్లు చేసి మద్దతు కోరుతున్నారని, తనకు మద్దతు ఇస్తే తాను ముఖ్యమంత్రి అయిన తరువాత వారి మంచిచెడ్డలు చూసుకొంటానని భరోసా ఇచ్చినట్లు ఆ మద్య మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను ఆయన ఖండిస్తున్నారు. తాను అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని తాను మళ్ళీ లోక్ సభకే పోటీ చేయాలనుకొంటున్నట్లు కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి చెప్పినట్లు సమాచారం.
జైపాల్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయకపోవడం నిజమైతే ఆయన హటాత్తుగా ఎందుకు మనసు మార్చుకొన్నారోనని ఆలోచించక తప్పదు. మళ్ళీ ఈసారి కూడా తెరాసయే గెలవడం ఖాయమని జైపాల్ రెడ్డి నమ్ముతున్నందునే ఆయన ఈ నిర్ణయం తీసుకొన్నారా లేక కేంద్రమంత్రిగా ఒకవెలుగు వెలిగిన తాను అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోతే అప్రదిష్ట అని భావించి వెనక్కు తగ్గారా లేక ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే తనకు కేంద్రమంత్రి పదవి లభిస్తుందనే ఉద్దేశ్యంతో ఎంపీగా పోటీ చేయాలనుకొంటున్నారా?అనే సందేహాలకు త్వరలోనే సమాధానాలు లభించవచ్చు.