దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలియగానే కాంగ్రెస్ నేతలు యధాప్రకారం ఆయనకు నచ్చ చెప్పేందుకు దానం ఇంటికి బయలుదేరారు. వారి రాకను ముందే ఊహించిన దానం నాగేందర్ వారు రాక మునుపే ఇంట్లో నుంచి జంప్ అయిపోయారు.
ఒకపక్క కాంగ్రెస్ నేతలు అయన కోసం వెతుకుతుంటే, అయన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో సమావేశం అవుతున్నారు. ఈ సంగతి మీడియా ద్వారా బయటకువచ్చిన తరువాత కాంగ్రెస్ నేతలు ఇక ఆయన కోసం వెతుకులాటలు నిలిపేసి అత్యవసరంగా జానారెడ్డి నివాసంలో సమావేశం అయ్యి ‘పరిస్థితిని సమీక్షించారు.’
దానం నాగేందర్ తో పాటు మరో ఇద్దరు సీనియర్ నేతలు కూడా తెరాసలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానం నాగేందర్ కు తెరాస సికింద్రాబాద్ ఎంపి టికెట్ ఆఫర్ చేసినట్లు అనధికార సమాచారం.
మంత్రి తలసానితో సమావేశం తరువాత దానం నాగేందర్ మీడియాతో మాట్లాడకుండా తన నివాసానికి వెళ్ళిపోయారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ, “దానంతో నాకు 30 ఏళ్లుగా మంచి స్నేహం ఉంది. అందుకే అయన మొదట నన్ను కలిశారు. అయన భవిష్య కార్యాచరణ గురించి రేపు ఆయనే స్వయంగా చెపుతారు. తెరాసలోకి ఎవరు వచ్చినా సాధరంగా ఆహ్వానిస్తాము,” అని అన్నారు.