కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరిన తరువాత సిఎం కెసిఆర్ ఆయనకు సెక్రెటరీ జనరల్ పదవినిచ్చి గౌరవించారు. ఆ తరువాత రాజ్యసభకు పంపారు. ఇప్పుడు ఆయనను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా నియమించేందుకు సిఎం కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. రెండు రోజుల క్రితం అయన ప్రధాని నరేంద్రమోడీని కలిసినప్పుడు ఆయన వద్ద ఈ విషయం కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మోడీ కూడా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని భావిస్తున్నారని తెలియడంతో సిఎం కెసిఆర్ ఈ ప్రతిపాదనను అయన ముందుంచినట్లు తెలుస్తోంది.
అయితే రాజ్యసభలో తెరాస కంటే ఎక్కువ సీట్లున్న పార్టీలు చాలానె ఉన్నాయి. కనుక డిప్యూటీ చైర్మన్ పదవి కోసం అవి కూడా పోటీపడతాయి. రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, డిఎంకె పార్టీలకు చెరో 13 సీట్లు ఉన్నాయి. ఆ మూడు పార్టీల అధినేతలతో సిఎం కెసిఆర్ కు సత్సంబందాలే ఉన్నాయి కనుక వారిని ఒప్పించి, వారి మద్దతు పొందగలిగితే కె.కేశవరావుకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి అవకాశం లభిస్తుంది. మరి కెసిఆర్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.