కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్-జేడిఎస్ సర్కార్ ఈరోజు శాసనసభలో జరిగిన బలపరీక్షలో ఎటువంటి అవాంతరాలు ఎదుర్కోకుండా నెగ్గింది. బలపరీక్షకు ముందు భాజపా సభ్యులు సభ నుంచి వాక్ అవుట్ చేయడంతో కుమారస్వామి సర్కార్ చాలా సులువుగా బలపరీక్షలో నెగ్గింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 111 మంది అవసరం ఉండగా, కాంగ్రెస్, జెడిఎస్ సభ్యులతో పాటు ఒక బిఎస్పి ఎమ్మెల్యే, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఓటు వేయడంతో మొత్తం 117 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. కనుక ప్రస్తుతానికి కుమారస్వామి గండం గట్టెక్కినట్లే భావించవచ్చు.
అయితే ఈరోజు శాసనసభలో ఎడ్యూరప్ప మాట్లాడుతూ, అపవిత్రపొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్-జెడిఎస్ ప్రభుత్వం ఎంతకాలం సాగుతుందో మేము చూస్తాం,” అని అన్నారు. అంటే ఏదో రోజు కాంగ్రెస్-జెడిఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, అటువంటి అవకాశం కోసం ఎదురుచూస్తుంటామని చెప్పకనే చెప్పినట్లు భావించవచ్చు. కనుక ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం అవసరమే.