మహారాష్ట్ర అడిషినల్ డిజిగా సేవలందిస్తున్న లక్ష్మినారాయణ తెలుగు ప్రజలందరికీ సుపరిచుతులే. ఇటీవలే ఆయన తన పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం అయన రాజీనామాను ఆమోదించింది. కనుక ఇక నుంచి ఆయన స్వేచ్చాజీవి. అయన జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ అయన వాటిని ఖండించారు. తాజాగా అయనను భాజపాలోకి తీసుకొని కీలకపదవి ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల బాలికలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై అయన స్పందిస్తూ, ప్రజలందరినీ ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపించగలిగితే ఇటువంటి నేరాలు తగ్గుతాయని అన్నారు. కనుక ఆధ్యాత్మికమార్గంలో పయనించబోతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఆయన పిల్లలు, విద్యార్ధులు, యువతకు వ్యక్తిత్వవికాస శిక్షణ కార్యక్రమాలు ఇస్తుండేవారు కనుక దానికే అంకితమయినా ఆశ్చర్యం లేదు. తన రాజీనామా ఆమోదం పొందిన తరువాత భవిష్య కార్యాచరణను ప్రకటిస్తానని లక్ష్మినారాయణ చెప్పారు కనుక మీడియాలో అయన గురించి వస్తున్న ఈ ఊహాగానాలన్నీ నిజమో కాదో త్వరలోనే తేలిపోనున్నాయి.