గవర్నర్ నరసింహన్ శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 8.30 గంటలకు కాళేశ్వరం చేరుకొని అక్కడ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం అన్నారం బ్యారేజి, సుందిళ్ళ బ్యారేజి, పంప్ హౌస్ పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 వరకు హెలికాఫ్టర్ ద్వారా గోలివాడ, నంది మేడారం టన్నల్ పంప్ హౌస్ పనులను, కరీంనగర్ జిల్లాలో లక్ష్మీపూర్ వద్ద జరుగుతున్న 8వ ప్యాకేజి పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 5గంటలకు హెలికాఫ్టర్ లో హైదరాబాద్ చేరుకొంటారు.
ప్రజాప్రతినిధులు, కేంద్రమంత్రులు లేదా కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ప్రాజెక్టుల పరిశీలనకు ఈవిధంగా క్షేత్రస్థాయి పర్యటనలు జరుపడం సాధారణమైన విషయమే కానీ రాష్ట్ర గవర్నర్ హటాత్తుగా ప్రాజెక్టు పనుల పరిశీలనకు బయలుదేరడమే కొంచెం ఆలోచింపజేస్తోంది. బహుశః ఆయన ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టు పనుల గురించి కేంద్రానికి సానుకూల సమాచారం అందించి కేంద్రం నుంచి అవసరమైన సహాయసహకారాలు, నిధులు పొందాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్యటనను ఏర్పాటు చేసి ఉండవచ్చు. లేదా ప్రాజెక్టు పనుల గురించి ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలు తప్పని నిరూపించేందుకే ఈ పర్యటన ఏర్పాటు చేసి ఉండవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ, రాష్ట్రంలో కేంద్రప్రభుత్వం ప్రతినిధిగా వ్యవహరించే గవర్నర్ నరసింహన్ కు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కళ్ళారా చూపించడం మంచి ఆలోచనే.