భారత ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థకు కొత్త సిఈఓగా సలీల్ ఎస్ పరేఖ్ నియమిస్తున్నట్లు ఆ సంస్థ శనివారం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన ఫ్రాన్స్ కు చెందిన క్యాప్ జెమినీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడుగా ఉన్నారు. అయన జనవరి 1 వరకు ఆ సంస్థలో పనిచేసి, జనవరి 2వ తేదీ నుంచి ఇన్ఫోసిస్ సంస్థ పగ్గాలు చేపడతారు.
సలీల్ ఫరేఖ్ బాంబే ఐఐటిలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తరువాత కార్నెల్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐటి రంగంలో పనిచేసి విశేషానుభవం గడించారు. అటువంటి అపార అనుభవజ్ఞుడు తమ సంస్థ సిఈఓగా పగ్గాలు చెప్పట్టబోవడం తమకు చాలా ఆనందంగా ఉందని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని అన్నారు.
కొన్ని నెలల క్రితం ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకులకు ఇన్ఫోసిస్ మాజీ సిఈఓ విశాల్ సిక్కాకు మద్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో అయన తన పదవి నుంచి తప్పుకోగా అయన స్థానంలో ఆ సంస్థలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న యు.బి. ప్రవీణ్ రావుకు తాత్కాలికంగా సిఈఓగా బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఇప్పుడు సలీల్ ఎస్ పరేఖ్ పూర్తి స్థాయి సిఈఓగా నియమితులు అవడంతో ఇన్ఫోసిస్ లో సమస్యలు ఒక కొలిక్కి వచ్చినట్లు భావించవచ్చు.