దసరా, దీపావళి పండుగల సందర్భంగా దేశంలో అన్ని సంస్థలు ప్రజలను ఆక్కటుకొనేందుకు పోటీలు పడి రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. బి.ఎస్.ఎన్.ఎల్.తో సహా దేశంలో అన్ని టెలీకాం కంపెనీలు తమ కస్టమర్లను జియో వైపు మళ్ళిపోకుండా కాపాడుకోవడానికి ఏడాది పొడవునా ఏదో ఒక ఆఫర్లు ప్రకటించవలసివస్తోంది. అయినప్పటికీ దసరా, దీపావళి పండుగల సందర్భంగా మళ్ళీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
జియోతో పోటీపడుతున్న బి.ఎస్.ఎన్.ఎల్. సంస్థ తన ప్రీ-పెయిడ్ కస్టమర్ల కోసం ఈరోజు రెండు ఆకర్షణీయమైన ప్లాన్స్ ప్రకటించింది.
వాటిలో రూ.249 విలువ చేసే స్పెషల్ టారీఫ్ ప్లాన్ తీసుకొన్నట్లయితే రోజుకు ఒక జిబి డేటా ఉచితంగా లభిస్తుంది. బి.ఎస్.ఎన్.ఎల్. నుంచి బి.ఎస్.ఎన్.ఎల్.కు చేసుకొనే అన్ని లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ ఉచితం. దీని వాలిడిటీ 28 రోజులు. ఈ ఆఫర్ అక్టోబర్ 25వరకు అందుబాటులో ఉంటుంది.
ఇక రెండవ ప్లాన్ జియో ‘ధన్ ధనాధన్’ ప్లాన్ ను పోలి ఉంది. దీనిలో రూ.429 ప్లాన్ తీసుకొన్నట్లయితే 90 రోజుల పాటు రోజుకు ఒక జిబి డేటా, అపరిమిత కాల్స్ సౌకర్యం అందిస్తోంది.
అయితే జియో కేవలం రూ. 399 లకే ఇదే ఆఫర్స్ అందిస్తోంది కనుక బి.ఎస్.ఎన్.ఎల్. ప్రకటించిన ఈ ప్లాన్ కు రూ.30 అదనంగా చెల్లించవలసి ఉంటుంది. జియో రోజుకు 1 జిబి డేటా, అన్ని నెట్ వర్క్స్ కు అపరిమిత కాల్స్ అందిస్తున్నప్పుడు, బి.ఎస్.ఎన్.ఎల్. నుంచి బి.ఎస్.ఎన్.ఎల్.కు చేసుకొనే కాల్స్ మాత్రమే ఉచితం అనే ఈ నిబంధన అవరోధంగానే కనిపిస్తోంది.
జియో డేటా కాల్స్ తో బాటు అదనంగా మ్యూజిక్, మూవీస్, మ్యాగజైన్స్ వంటి అనేకం అందిస్తోంది. కనుక బి.ఎస్.ఎన్.ఎల్. జియోతో పోటీపడాలనుకొంటే ఇంకా మంచి ఆఫర్లతో రావలసి ఉంటుంది.