వాట్సప్ పరిచయమే అవసరంలేని మొబైల్ యాప్. ముఖ్యంగా కోట్లాది భారతీయుల దైనందిన జీవితంలో విడదీయలేనంతగా అల్లుకుపోయింది. ఇటీవల కొత్త ప్రైవేట్ పాలసీని ప్రకటించిన వాట్సప్ ఫిబ్రవరి 8లోగా దానిని ఆమోదించాలని తన వినియోగదారులను కోరింది లేకుంటే వాట్సాప్ ఖాతాలు తాత్కాలికంగా నిలిపివేయబడటమో లేదా శాశ్వితంగా రద్దవుతాయని హెచ్చరించింది.
వాట్సప్ విధించిన ఈ షరతుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఎందుకంటే వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీని ఆమోదించినట్లయితే, దానిలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారమంతా ఫేస్బుక్లో కూడా షేర్ అయ్యే ప్రమాదం ఉంది. వాట్సప్లో వ్యక్తిగత సమాచారానికి ఉన్నంత భద్రత ఫేస్బుక్లో లేదు కనుక వాట్సప్ వినియోగదారుల వివరాలు బహిర్గతమయ్యే ప్రమాదం ఉంది.
వినియోగదారుల ఆగ్రహాన్ని చవిచూసిన వాట్సప్ సంస్థ తన ప్రైవసీ పాలసీ నిబందనపై వెనక్కు తగ్గక తప్పలేదు. తమ నిర్ణయం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నట్లు గుర్తించామని కనుక ఈ ప్రతిపాదనను మే 15వరకు వాయిదా వేస్తున్నట్లు వాట్సప్ సంస్థ ప్రకటించింది. వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీని వినియోగదారులు అంగీకరించకపోయినప్పటికీ వారి ఖాతాలు నిలిపివేయబోమని, భవిష్యత్లో కూడా అటువంటి చర్యలకు పాల్పడబోమని ప్రకటించింది.