ఏటా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)ను కరోనా కారణంగా కొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఈ అంశంపై చర్చించేందుకు మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన బుదవారం నాంపల్లిలో ఏగ్జిబిషన్ సొసైటీ సమావేశం జరిగింది. నుమాయిష్ను వాయిదా వేయడం వలన దాని కోసమే వివిద రాష్ట్రాల నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చిన సుమారు 2,000 మంది వ్యాపారులు, వ్యాపారసంస్థలు నష్టపోతాయని తెలిసి ఉన్నప్పటికీ, నుమాయిష్కు వచ్చే లక్షలాదిమంది ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కొన్ని రోజులు వాయిదావేయక తప్పలేదని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. అయితే నుమాయిష్కు వచ్చేవారికి కరోనా సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎటువంటి విధివిధానాలు పాటించాలో నిర్ణయించుకొన్న తరువాత తప్పకుండా నుమాయిష్ను నిర్వహిస్తామని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
గత ఏడాది జరిగిన నుమాయిష్లో భారీ అగ్నిప్రమాదం జరుగడంతో సుమారు 300 స్టాల్స్ దగ్దం అయ్యాయి. వందల కోట్లు విలువగల ఉత్పత్తులు అగ్నికి ఆహుతైపోయాయి. వ్యాపారులు, వ్యాపార సంస్థలు ఆ చేదు అనుభవాన్ని దిగమింగి మళ్ళీ నుమాయిష్ ఏర్పాటుకు సిద్దపడితే ఈసారి కరోనా రూపంలో వారికి అవరోధం ఎదురవుతోంది.