మెట్రో ప్రయాణికులకు మరో బంపర్ ఆఫర్

October 31, 2020
img

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “రేపటి నుంచి మెట్రో స్మార్ట్ కార్డులపై 50 శాతం గరిష్టంగా రూ. 600 వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వాలని నిర్ణయించాము. ఆన్‌లైన్‌ ద్వారా లేదా మెట్రోస్టేషన్లలో స్మార్ట్ కార్డులను రీ-ఛార్జ్ చేసుకొన్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. స్మార్ట్ కార్డులు రీ-ఛార్జ్ చేసుకొంటే లభించే క్యాష్ బ్యాక్‌ స్మార్ట్ కార్డులోనే జమా అవుతుంది. అయితే రేపటి నుంచి 90 రోజులలోగా దీనిని వినియోగించుకోవలసి ఉంటుంది,” అని చెప్పారు. 

ప్రస్తుతం మెట్రోలో అన్ని మార్గాలలో కలిపి రోజుకు 1.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఇటీవల సువర్ణ ప్యాకేజీ ప్రకటించినప్పటి నుంచి ప్రయాణికుల సంఖ్య 30 శాతం వరకు పెరిగిందని చెప్పారు. కరోనా నేపధ్యంలో మెట్రోలో అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నందున మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పారు. 

కరోనాకు ముందు అంటే మార్చి మొదటి వారం వరకు మెట్రోలో రోజుకు 3.50 లక్షల మందికి పైగా ప్రయాణించేవారు. అటువంటిది ఇప్పుడు 1.30 లక్షల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారంటే హైదరాబాద్‌ మెట్రో సంస్థ ఎంత ఒత్తిడికి గురవుతుందో అర్ధం చేసుకోవచ్చు. అయినప్పటికీ మెట్రో అధికారులు నిబ్బరం కోల్పోకుండా ఇటువంటి ఆఫర్లు ప్రకటిస్తూ క్రమంగా ప్రయాణికుల సంఖ్యను పెంచుకొంటుండటం చాలా అభినందనీయం.

Related Post