రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్త! నేటి నుంచి రైలు బయలుదేరడానికి 5 నిమిషాల ముందు వరకు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు...రద్దు చేసుకోవచ్చు కూడా. ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న తేజస్తో సహా అన్ని ప్రత్యేక రైళ్ళకు ఇది వర్తిస్తుందని రైల్వేశాఖ తాజా ప్రకటన ద్వారా తెలియజేసింది.
టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్ సమయాలలో మార్పు చేసినందున, రైల్వేస్టేషన్లలో ఉంచే రిజర్వేషన్ ఛార్టులలో కూడా ఆ మార్పులు కనబడతాయి. రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు విడుదల చేసే రిజర్వేషన్ ఛార్టులో అప్పటివరకూ కన్ఫాం అయిన టికెట్స్ వివరాలు ఉంటాయి. రైలు బయలుదేరడానికి 5 నుంచి 30 నిమిషాలలోపు రద్దు అయిన టికెట్లకు ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్టులలో ఉన్నవారికి ఖరారైన వివరాలు ఆన్లైన్లో మరియు రైల్వేస్టేషన్లలోని కియోస్కీలలో ప్రతిబింబిస్తుంటాయి. ఎప్పటికప్పుడు రద్దు అయ్యే టికెట్లను (ఖాళీలను) బట్టి ప్యాసింజర్ రిజర్వేషన్ కౌంటర్లలో అలాగే ఆన్లైన్ ద్వారా కూడా కన్ఫాం టికెట్స్ జారీ చేయబడతాయి.