జూన్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 200 ఏసీ, నాన్-ఏసీ రైళ్ళు ప్రారంభం కానున్నాయి. కనుక గురువారం ఉదయం 10 గంటల నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆ రైళ్లలో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. కరోనా నేపధ్యంలో మరికొన్ని రోజుల వరకు రైల్వే స్టేషన్లలో బుకింగ్ కౌంటర్స్ తెరవకూడదని రైల్వేశాఖ నిర్ణయించింది. కనుక ఈ రైళ్లలో టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే లభిస్తాయి. ప్రస్తుతం దేశంలో చాలా భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నందున కేవలం 30 రోజులు ముందుగానే అడ్వాన్స్ టికెట్స్ బుక్ చేసుకొనేందుకు వీలు కల్పించింది. ఆ గడువులోగా ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ కోటాను అనుమతిస్తారు. వారిలో కన్ఫర్మ్ టికెట్స్ పొందినవారిని మాత్రమే రైల్వేస్టేషన్లోకి అనుమతిస్తారు.
టికెట్ బుక్ చేసుకోవాలంటే కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యసేతు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం తప్పనిసరి. ప్రయాణానికి గంటన్నర ముందుగా రైల్వేస్టేషన్ చేరుకొని ధర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవలసి ఉంటుంది. కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. కనుక టికెట్ బుక్ చేసుకొన్నప్పటి నుంచి ప్రయాణికులు తప్పనిసరిగా తమ ఆరోగ్యం కాపాడుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ప్రయాణ సమయంలో మాస్క్ ధరించడం, ఇతర కరోనా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
తెలంగాణ రాష్ట్రానికి రాకపోకలు సాగించే రైళ్ల వివరాలు:
గోదావరి ఎక్స్ప్రెస్: హైదరాబాద్- విశాఖపట్నం-హైదరాబాద్
గోల్కొండ ఎక్స్ప్రెస్: సికింద్రాబాద్-గుంటూరు-సికింద్రాబాద్
రాయలసీమ ఎక్స్ప్రెస్: నిజామాబాద్-తిరుపతి-నిజామాబాద్
తెలంగాణ ఎక్స్ప్రెస్: హైదరాబాద్-డిల్లీ- హైదరాబాద్
హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్: హైదరాబాద్-ముంబై-హైదరాబాద్
ఫలక్నూమా ఎక్స్ప్రెస్: హౌరా-సికింద్రాబాద్-హౌరా
డనాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్: సికింద్రాబాద్- డనాపూర్ - సికింద్రాబాద్.