దేశంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు, ఆర్ధికసంస్థలు చేప్పటిన అనేక చర్యలు సత్ఫలితాలు ఇస్తుండటంతో వాటిని మరింత ప్రోత్సహించేందుకుగాను నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) పద్దతిలో జరిపే నగదు బదిలీలపై ఇకపై ఎటువంటి సర్వీసు ఛార్జీలు వసూలు చేయరాదని రిజర్వ్ బ్యాంక్ దేశంలో అన్ని బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జనవరి నుంచి దీనిని అమలుచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. నగదురహిత లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు ఇకపై పార్కింగ్ ఫీజులను, పెట్రోల్ బంకుల వద్ద చెల్లింపులకు ఫాస్ట్ ట్యాగ్స్ ను అనుమతించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది.
దేశంలో నగదురహిత లావాదేవీలు పెరిగినట్లయితే నకిలీనోట్ల చలామణి చాలావరకు అరికట్టవచ్చు. అయితే నగదురహిత లావాదేవీలతో పాటు ఆన్లైన్ మోసాలు కూడా గణనీయంగా పెరిగిపోయినందున ఆన్లైన్ లావాదేవీలకు మరింత భద్రత కల్పించవలసిన అవసరం చాలా ఉంది. అప్పుడే ప్రజలు పూర్తిగా నగదురహిత లావాదేవీలకు మొగ్గు చూపుతారు.