న్యూడిల్లీ-వారణాసి మద్య ప్రవేశపెట్టిన మొట్టమొదటి హైస్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవంతం అవడంతో రాబోయే రెండేళ్ళలో అటువంటివి 40 ట్రైన్స్ దేశమంతటా ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. వీటి కోసం రైల్వేశాఖ ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది కూడా.
మేకిన్ ఇండియాలో భాగంగా తయారైన ఈ మొట్టమొదటి హైస్పీడ్ ట్రైన్ గంటకు 160 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. దానిలో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సాధారణ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ తో పోలిస్తే వందే భారత్ టికెట్ ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ, ఇప్పుడు చాలా మంది ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతుండటంతో వందే భారత్ ఎక్స్ప్రెస్కు మంచి ఆధరణ లభిస్తోంది. అదీగాక సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే 3-4 గంటలు ముందుగానే తమ గమ్యస్థానాలు చేరుకునే అవకాశం ఉండటంతో ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, చివరికి రాజకీయనాయకులు కూడా దీనిలో ప్రయాణిస్తున్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్కు లభిస్తున్న ప్రజాధారణను దృష్టిలో ఉంచుకొని అటువంటివే మరో 40 హైస్పీడ్ ట్రెయిన్స్ ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది.