హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో చిన్న శుభవార్త. అమీర్పేట్-హైటెక్సిటీ మార్గంలో శనివారం నుంచి మాధాపూర్ మెట్రో స్టేషన్లో కూడా మెట్రో రైళ్లు ఆగుతాయని మెట్రో అధికారులు తెలియజేశారు. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైళ్లు వెనక్కు తిరిగి వచ్చేందుకు ఇంకా ఏర్పాట్లు పూర్తికానందున, ఈ మార్గంలో మాదాపూర్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆపడం లేదు. కానీ నేటి నుంచి రోడ్ నంబరు 36లో గల మాదాపూర్ మెట్రో స్టేషన్లో మెట్రో రైళ్లు ఆపాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే నెలాఖరులోగా హైటెక్సిటీ స్టేషన్ వద్ద రివర్సల్ కోసం అవసరమైన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఎల్&టి సిబ్బంది పనిచేస్తున్నారు. అది పూర్తయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ స్టేషన్లో కూడా మెట్రో రైళ్లు ఆపుతారు. అప్పుడు మెట్రో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మెట్రో రైళ్ల వేగం కూడా పెరిగే అవకాశం ఉంది.