అమీర్పేట్-హైటెక్సిటీ మెట్రో సర్వీసులకు గవర్నర్ నరసింహన్ ఈరోజు ఉదయం 9.15 గంటలకు అమీర్పేట్ మెట్రో స్టేషన్లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఈ మార్గంలో మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం హైటెక్ సిటీ వద్ద మెట్రో రైళ్లు ట్రాక్ మారి వెనక్కు (రివర్స్) తిరిగివచ్చే సౌకర్యం లేనందున హైటెక్ సిటీకి 5కిమీ దూరంలో ఉన్న జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ స్టేషన్ వద్ద ట్రాక్ మార్చుకొని ముందుకు వెళ్ళి మళ్ళీ అదే ట్రాక్ పై వెనక్కు రావలసి ఉంటుంది. కనుక ఆ ట్రాక్ పై వెళ్ళిన రైలు వెనక్కు తిరిగివస్తే గానీ ఆ మార్గంలో మరో మెట్రో రైలు ప్రయాణించలేదు. ఈ కారణంగా అమీర్పేట్-హైటెక్సిటీ మెట్రో కారిడార్లో సుమారు 9-12 నిమిషాలకు ఒక రైలు మాత్రమే నడిచే అవకాశం ఉంది.
ఈ సమస్య కారణంగా నాగోల్ నుంచి అమీర్పేట్ మీదుగా హైటెక్ సిటీ వెళ్ళే మెట్రో రైళ్లను జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మ గుడి, మాదాపూర్ స్టేషన్లలో ఆపకుండా నడిపిస్తేనే సమయానికి సజావుగా నడిచే అవకాశం ఉంటుందని మెట్రో అధికారులు గుర్తించారు. కనుక ఈ రివర్సల్ విధానం అందుబాటులో వచ్చే వరకు ఈ మూడు స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగవు.
దుర్గం చెరువు, హైటెక్ సిటీ స్టేషన్లలో రెండు ప్లాట్ ఫారంలలో ఏ ప్లాట్ ఫారంపైకి ఎటువెళ్ళే రైలు వస్తుందో ముందుగా ప్రకటిస్తుంటారు. ఆ ప్రకారం ప్రయాణికులు ఆ ప్లాట్ ఫారంపైకి చేరుకొని మెట్రో రైలును ఎక్కవలసి ఉంటుంది.
అమీర్పేట్-హైటెక్సిటీ మద్య మెట్రో టికెట్ ధరలు ఈవిధంగా ఉండబోతున్నాయి.
అమీర్పేట్-మధురానగర్ : టికెట్ ధర:10
అమీర్పేట్-యూసఫ్ గూడ: టికెట్ ధర:15
అమీర్పేట్-జూబ్లీ హిల్స్ రోడ్ నెంబరు-5: టికెట్ ధర:15
అమీర్పేట్-దుర్గం చెరువు: టికెట్ ధర:35
అమీర్పేట్-హైటెక్సిటీ: టికెట్ ధర:35(దూరం 10కిమీ/ ప్రయాణ సమయం 18 నిమిషాలు)
అమీర్పేట్-నాగోల్-మియాపూర్-ఎల్బీ నగర్ కారిడార్లలో టికెట్ ధరలు ఈవిధంగా ఉన్నాయి:
అమీర్పేట్-నాగోల్: టికెట్ ధర:60(దూరం 27కిమీ/ ప్రయాణ సమయం 50 నిమిషాలు).
అమీర్పేట్- ఎల్బీనగర్: టికెట్ ధర:55(దూరం 26కిమీ/ ప్రయాణ సమయం 55 నిమిషాలు).
అమీర్పేట్-మియాపూర్: టికెట్ ధర:50(దూరం 22కిమీ/ ప్రయాణ సమయం 50 నిమిషాలు).