ఈరోజు విజయవాడ, గుంటూరు నగరాలలోని టిడిపి నేతల ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు జరుగుతాయని మీడియాలో వార్తలు రాగా, ఐటి అధికారులు హైదరాబాద్ కు చెందిన సదరన్ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్, గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న డిఎస్ లాజిస్టిక్స్ అనే రెండు సంస్థల కార్యాలయాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాలలో ఆ రెండు సంస్థలకు చెందిన కార్యాలయాలపై ఏడు ఐటిక బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నాయి.
రాజకీయ నాయకుల ఇళ్ళు, కార్యాలయాలపై తాము దాడులు చేస్తామని మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని ఈ సోదాలలో పాల్గొంటున్న ఒక ఐటి అధికారి చెప్పారు. తాము ఎప్పుడు ఎవరి ఇళ్ళు, కార్యాలయాలలో సోదాలు చేయాలనే విషయం చివరి నిమిషం వరకు తమకే తెలియకుండా రహస్యంగా ఉంచుతారని, కనుక దాడుల విషయం ముందుగా మీడియాకు తెలిసే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
అయితే మీడియా దృష్టి నుంచి తప్పించుకోవడానికే ఐటి అధికారులు ముందుగా ఆ రెండు సంస్థలలో సోదాలు నిర్వహిస్తున్నారని, ఆ తరువాత వారు రాష్ట్ర మున్సిపాల్ శాఖ మంత్రి నారాయణకు చెందిన నారాయణా విద్యాసంస్థలపై దాడులు చేస్తారని విజయవాడలో జోరుగా పుకార్లు వినిపిస్తుండటంతో ఈరోజు ఉదయం నుంచి మీడియా ప్రతినిధులు ఐటి అధికారుల వెంటపడుతున్నారు.